ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హాకీ జట్టుకి నగదు బహుమతి ప్రకటన

  • ఒక్కో ఆటగాడికి రూ.15 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
  • సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.50 లక్షల చొప్పున ప్రకటన
  • 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు
ఏకంగా 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్యం సాధించిన జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.15 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్టు వెల్లడించింది. ఇక జట్టులోని సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షలు అందజేయనున్నట్టు తెలిపింది.

కాగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో భారత జట్టు పతకాన్ని ముద్దాడినట్టయింది.

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన జట్టుపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రశంసల జల్లు కురిపించారు. వరుసగా రెండవ ఒలింపిక్‌లోనూ పతకం గెలవడం అసాధారణమైన విజయమని ఆటగాళ్లను కొనియాడారు. ఈ నగదు బహుమతి క్రీడాకారుల ప్రయత్నాలకు ఒక ప్రశంస మాత్రమేనని దిలీప్ టిర్కీ వ్యాఖ్యానించారు. ఈ విజయం ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కృషి, సంకల్పానికి నిదర్శమని అన్నారు.

Paris Olympics
India Hockey Team
Hockey
India
Hockey India

More Telugu News